భీష్మ ఏకాదశి రోజున ఇలా చేస్తే…పుణ్యఫలాలను పొందవచ్చు

0
362

భీష్మ ఏకాదశి : 16 ఫిబ్రవరి 2019, శనివారం, మాఘ శుద్ధ ఏకాదశి తిథిలో వస్తోంది. మహాభారతం ప్రకారం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలు అర్ఘ్యం సమర్పించడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

భీష్ముడు భారతంలో మణిపూస వంటివాడు. ఇతడు సత్యవతీ, శంతనుల వివాహ సంధానకర్తగా, ధృతరాష్ట్ర, పాండురాజులు పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పించిన పితృతుల్యునిగా, కౌరవుల సర్వసైన్యాధక్షునిగా, సర్వలోకావళికి పాపభంజనం, పుణ్యప్రదం, మోక్షప్రదమునగు ‘శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము’ను అందించిన ఆచార్యునిగా సుప్రసిద్ధుడు. గంగాదేవి గాంగేయుని పరశురాముని వద్ద సకల విద్యలు, ధనుర్విద్యను నేర్పించి కొంత కాలమునకు శంతన మహారాజుకు అప్పగించింది.

సత్యవతి తండ్రి దాశరాజుకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసినందున తాను యావజ్జీవము బ్రహ్మచర్య వ్రతము పాటించి గాంగేయుడు భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు. అలాంటి మహిమాన్వితుడు.. అంపశయ్యపై వుంటూ విష్ణుసహస్ర నామాన్ని బోధించాడు. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన “విష్ణుసహస్రనామస్తోత్రం” ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతీ అక్షరము దైవస్వరూపమే. ప్రతీ నామమూ మహామంత్రమే.

మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథులలో ‘ఏకాదశి’ ముఖ్యమైనది. దీనినే ‘హరివాసరము’ అని కూడా అంటారు. ఏకాదశి తిథిన భక్తజనులు ఉపవాసము చేస్తారు. భగవన్నామ స్మరణ, జప, పారాయణలతో భగవానుని సమీపమున (ఉప) మనస్సును ఉంచుటయే(వాసము) ఉపవాసం చేస్తారు. అందుకే ఈ రోజున విష్ణ సహస్ర నామాన్ని పఠించి.. భీష్మాచార్యుల అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి.