సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన చిత్రం “2.O”. ఈ చిత్రం గత యేడాది నవంబరు నెలలో విడుదలై కాసుల వర్షం కురిపించింది. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పక్షిరాజు పాత్రలో విలన్గా కనిపించాడు.
4డి సౌండ్ను పరిచయం చేస్తూ 3డిలో తెరకెక్కించిన ఈ చిత్రం ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో ప్రపంచ స్థాయి సినీ అవార్డుల్లో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ రీల్ అవార్డుల రేసులో నామినేషన్ సాధించింది.
కాగా, ఈనెల ఫిబ్రవరి 17వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో 66వ గోల్డెన్ రీల్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది. విదేశీ చిత్రాల్లో ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో “2.O” ఎంపికైంది. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఓటింగ్ జరుగగా, ఈనెల 17వ తేదీన విజేతలను ప్రకటిస్తారు.
మరోవైపు, ఈ చిత్రానికి సౌండ్ డిజైనర్గా పనిచేసిన రసూల్ పూకుట్టి గతంలో ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్నాడు. దీంతో గోల్డెన్ రీల్ కూడా ఆయన ఖాతాలో చేరడం ఖాయమని యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.