అస్సాం లో ఘోరం జరిగింది.. కల్తీమద్యం కాటుకు 110 మంది మృతి

0
36

అస్సాం లో ఘోరం జరిగింది. కల్తీమద్యం కాటుకు ఏకంగా 110 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. కల్తీ మద్యం తాగిన వారిలో 31 మంది శనివారం సాయంత్రమే ప్రాణాలు కోల్పోగా అప్పటి నుంచి గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకరి ప్రాణం గాల్లో కలిసిపోతూనే ఉంది. శనివారం సాయంత్రానికి మృతుల సంఖ్య 110కి చేరుకుంది. మరో 341 మంది వివిధ ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. ఒక్క గోల్‌ఘాట్ జిల్లాలోనే 59 మంది మృతి చెందగా, జోర్‌హాట్ జిల్లాకు చెందిన వారు 45 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కల్తీ మద్యం తాగిన తేయాకు కూలీలందరూ గురువారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, అస్వస్థతకు గురైన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.