సౌదీ అరేబియా సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అల్ఖైదా ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు దివంగత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజాబిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాంగశాఖ మంత్రి ప్రకటించారు.
అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ను పట్టించినా, అతని ఆచూకీ చెప్పినా తాము మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తామని యునైటెడ్ స్టేట్స్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ మైఖైల్ ఇవనాఫ్ ప్రకటించింది.
ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే సౌదీ అరేబియా హంజాబిన్ పౌరసత్వాన్ని రద్దు చేసింది. అల్ ఖైదా నాయకుడిగా కార్యకలాపాలు సాగిస్తున్న హంజాబిన్ లాడెన్ను 2017 జనవరిలో అంతర్జాతీయ తీవ్రవాదిగా అమెరికా ప్రకటించింది. హంజాబిన్ లాడెన్ ఆస్తులను అమెరికా బ్లాక్ చేసింది. హంజాబిన్ లాడెన్ సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్నారు.
మొత్తంమీద హంజాబిన్ లాడెన్ పౌరసత్వం రద్దు నిర్ణయం సౌదీ అరేబియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం పాకిస్థాన్కు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ఎందుకంటే.. హింజాబిన్, అజహర్ మసూద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఇపుడు పాకిస్థాన్ కూడా ఉగ్రవాదులపై కఠిన వైఖరిని అవలంభించాల్సిన నిర్బంధ పరిస్థితులు ఏర్పడ్డాయి.