పత్తా లేకుండా పారిపోయిన బీజేపీ అభ్యర్థి

0
45

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపుతోంది. వచ్చే నెల 11వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ సమయం దగ్గరపడుతున్న వేళ పోటీ రసవత్తరంగా మారుతోంది.

నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన గురువారం కొన్ని పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగినవారు తమ నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఇలాంటివారంతా ఆ పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు చొరవతో ఆ పార్టీ రెబల్స్‌గా బరిలోకి దిగినవారు దాదాపుగా తప్పుకున్నారు.

అయితే, కడప జిల్లా రామాపురం మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ మహేశ్వరరెడ్డి విషయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన గురువారం ఒక్కసారిగా పార్టీకి షాకిచ్చారు.

గురువారం మధ్యాహ్నం తన నామినేషన్ ఉపసంహరించుకున్న మహేశ్వరరెడ్డి ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఏం జరిగిందో తెలియక బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.