డీఎల్ జోస్యం.. చంద్రబాబు ఓడిపోతారంతే.. జగన్ సీఎం కావడం ఖాయం..

0
34

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి, కడప జిల్లా నేత డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు. కడప జిల్లా మైదుకూరులో జగన్ ఎన్నికల ప్రచారంలో డీఎల్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దివంగత వైఎస్సార్ తనకు మంచి స్నేహితుడని, ఇప్పుడాయన కుమారుడి పార్టీలో చేరడం తనకు ఎంతో సంతోషంగా ఉందని డీఎల్ చెప్పారు. వెఎస్ జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని డీఎల్ జోస్యం చెప్పారు.

వైకాపా పార్టీ అధినేత జగన్ ఆయనకు కండువా వేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎల్ మాట్లాడుతూ, 2004లో వైఎస్సార్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో, 2019లో కూడా జగన్ చేతిలో అలాగే ఓడిపోతారని ఓ ఆంగ్ల దినపత్రిక రాసిందని చెప్పారు. అదే తరహాలో ఈసారి చంద్రబాబుకు ఓటమి ఖాయమని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తద్వారా ఇంగ్లీషు దినపత్రిక రాసింది, నిజం కాబోతుందని డీఎల్ వ్యాఖ్యానించారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును ఎంతో విలువైనదిగా భావించి చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి వినియోగించుకోవాలని డీఎల్ పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, ముఖ్యంగా గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.