నవ్యాంధ్రలో నిశ్శబ్ద విప్లవం : మాజీ జేడీ లక్ష్మీనారాయణ

0
59

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం సాగుతోందని సీబీఐ మాజీ జేడీ వివి.లక్ష్మీనారాయణ అన్నారు. ఈయన జనసేన పార్టీ తరపున విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవ్యాంధ్రలో అధికారం సాధిస్తామని, 85 నుంచి 125 మధ్య సీట్లు సాధించి జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

ప్రజల్లోని నిశ్శబ్ద విప్లవం జనసేనకు మేలు చేయనుందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు జనసేనతో రావాలని ఆశిస్తున్నారన్నారు. పౌరుల భవిష్యత్తు కోసం జనసేన మేనిఫెస్టోను రూపకల్పన చేసిందని, అది ప్రజల్ని ఆకర్షిస్తోందని చెప్పారు.

విశాఖ సమస్యలను గుర్తించానని తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు తీవ్ర నీటి సమస్యతో బాధపడుతున్నారని, దీన్ని అధిగమించడానికి చర్యలు చేపట్టనున్నట్లు ప్రజలకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అలాగే వైద్య సేవలను కూడా విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పాలన కొనసాగిస్తుందన్నారు.