మోడీకి ముని శాపం ఉంది.. నిజం చెబితే తల వెయ్యి వక్కలైపోతుంది : చంద్రబాబు

0
50

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటైన విమర్శలు చేశారు. మోడీకి ఓ ముని శాపం ఉందన్నారు. ఆయన నిజం మాట్లాడితే తల వెయ్యి వక్కలైపోతుందన్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, చిత్తూరు జిల్లా పూతలపట్టు తంబళ్లపల్లిలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “ఐదేళ్లు నేనెలా పరిపాలించాను, నువ్వెలా పరిపాలించావు? నీ పాలనలో దేశంలో ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారా? ఉద్యోగాలు పోయాయా? లేదా? ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయిందా? లేదా? ఆదాయం రెండింతలు చేస్తామన్నారు, ఎక్కడైనా వచ్చిందా? కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆదాయం 128 శాతం పెంచిన ఏకైక ప్రభుత్వం మనదేనని చెప్పారు.

తిరుపతి సభలో నదుల అనుసంధానం చేస్తామని చెప్పారు, చేశారా మరి? మేం చేశాం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం చేసి చూపించాం. పోలవరం మన జీవనాడి, అదేదో ఈయనిచ్చినట్టుగా చెబుతున్నారు. జాతీయ ప్రాజక్టు అని, అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నరేంద్ర మోడీ ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు. కొర్రీలపై కొర్రీలు వేసి.. ఫైల్స్‌ను తిప్పిపంపుతున్నారు. అమరావతిని చూస్తే మోడీకి కడుపు మండిపోతోందన్నారు. ఆయన అహ్మదాబాద్ కంటే మన అమరావతి మించిపోవడం మోడీకి నచ్చడంలేదని తెలిపారు.

‘నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ నమ్మకద్రోహి. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడు. ప్రత్యేక హోదా కోసం 29 సార్లు తిప్పుకున్నాడు. నాకంటే వెనుక రాజకీయాల్లోకి వచ్చి నాకే కథలు వినిపిస్తున్నాడు. నేను 95లో ముఖ్యమంత్రి అయితే, 2002లో వచ్చాడీ మోడీ. అదృష్టం కలిసొచ్చి ప్రధాని అయ్యారు మీరు, అందుకు మాకేం బాధలేదు. కానీ ఆంధ్ర ప్రజలను కించపరిస్తే సహించేదిలేదు. మీ బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. మీ స్థాయికి తగ్గట్టు వ్యవహరించండి. మీ దగ్గరున్న శాఖలను మాపై ప్రయోగించి ఊడిగం చేయించుకోవాలనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ జరగదు. మీకు ఊడిగం చేయాలనుకుంటే… ఉన్నాడు జగన్! కేసులుండడంతో జైలుకు వెళతానన్న భయంతో ఈ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

మొన్న కర్నూలుకు వచ్చారు, ఇవాళ రాజమండ్రి వచ్చారు. ఏ మొహం పెట్టుకుని మా గడ్డపై అడుగుపెట్టారు? ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో అడుగుపెట్టాలి. ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తుంటే వ్యక్తిగత దాడలు చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలపై దాడి. ఇక్కడి ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారా? నా కొడుకు, నా కుటుంబం గురించి మాట్లాడతావా నువ్వు? నీ కుటుంబం గురించి చెప్పు వింటాం! నువ్వు ఒకటి అంటే మేం పది అంటాం. నాది యూటర్నా, వెంకన్న సాక్షిగా యూటర్న్ తీసుకుంది మీరు. నాది రైట్ టర్న్. మీరు చేసిన తప్పుడు పనులకు జాతీయ స్థాయిలో వ్యతిరేకించాం. మీరు తీసుకున్న నోట్ల రద్దు ఎవరికైనా ఉపయోగపడిందా? ఇది తుగ్లక్ చర్య. ఈయన నీతి నిజాయతీ గురించి నాకు చెబుతారు” అంటూ నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు.

ఇకపోతే, జగన్ ఇలాకా పులివెందులలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంతో పాటు రోడ్‌షో నిర్వహించారు. జీఎస్టీ‌లాగా పులివెందులలో జేఎస్టీ (జగన్ ట్యాక్స్) ఉందన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ట్యాక్స్ చూడలేదని, ముందుముందు జగన్ ఆటలు సాగనివ్వమని, దళారీ వ్యవస్థ పోవాలని హెచ్చరించారు. రైతుల నుంచి జగన్ వాటా తీసుకుంటున్నారని ఆరోపించారు.

కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్ వర్గానిది అని, వైసీపీ నేతలకు దోచుకోవడం తప్ప మరేమీ చేతకాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ట్యాక్స్ లేకుండా పంటకు మద్దతు ధర ఇప్పిస్తానని రైతులకు హామీ ఇస్తున్నానని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉండని జగన్ కు, ఇక్కడి పోలీసులపై నమ్మకం లేని జగన్ కు ఇక్కడి ఓట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. పులివెందులలో ఏకపక్షంగా ఓటింగ్ జరగాలని, టీడీపీని గెలిపించాలని కోరారు.