మోడీ బిజ్జలదేవుడు… జగన్ భల్లాలదేవుడు : చంద్రబాబు ధ్వజం

0
38

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శల దాడి చేశారు. చిత్తూరులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం డబ్బుల్లేకపోయినా ఆనందంగా, సంతృప్తికరంగా ఉన్నామంటే అది తన పాలన కారణంగానే అని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రతి ఊళ్లో దళారీ వ్యవస్థ తీసుకువస్తాడని ఆరోపించారు. తాను పసుపు-కుంకుమ చెక్కులు ఇస్తే అవి చెల్లవని కోడికత్తి పార్టీ చెబుతోందని చంద్రబాబు మండిపడ్డారు.

“నా చెక్కులు భేషుగ్గా చెల్లుతాయి కానీ, మీ నెత్తిన రూపాయి పెడితే పావలాకు దిక్కులేదు, మీరే చెల్లని కాసులు” అంటూ సెటైర్ వేశారు. జగన్ కరడుగట్టిన ఫ్యాక్షన్ లీడర్ అని, జగన్ గెలిస్తే అది నేరస్తుల గెలుపు అవుతుందని, అంతిమంగా అది కేసీఆర్ గెలుపు అవుతుందన్నారు. జగన్ తమకు వద్దని పులివెందుల ప్రజలు కూడా చెబుతున్నారని వివరించారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ తనను భల్లాలదేవుడు అనడం పట్ల చంద్రబాబు ధీటుగా కౌంటరిచ్చారు.

“ఆంధ్రప్రజలు బాహుబలి అయితే జగన్ భల్లాలదేవుడు. ఈ విలన్‌కు తండ్రి కుట్రలు, కుతంత్రాలు చేసే బిజ్జలదేవుడు నరేంద్ర మోడీ. ఈ భల్లాలదేవుడు, బిజ్జలదేవుడు మనల్ని ఏమీ చేయలేరు. నాదే విజయం. ఈ ఎన్నికల యుద్ధంలో 25కి 25 సీట్లు గెలిచి చూపిస్తాం” అంటూ చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు.