జన్ధన్ ఖాతాల్లోకి రూ.10 వేల రూపాయల నగదు వచ్చి జమవుతోంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జన్ధన్ ఖాతాదారుల్లో జరిగింది. ఈ హఠాత్పరిణామంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేగింది.
ఈ రాష్ట్రంలోని వందల సంఖ్యలో ఉన్న జన్ధన్ ఖాతాల్లో అనుమానాస్పద డిపాజిట్లు కలకలం సృష్టిస్తున్నాయి. మొరాదాబాద్ జిల్లాలో 1700 జన్ధన్ ఖాతాల్లో గత కొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో డబ్బు జమ అయ్యింది. ఒక్కో ఖాతాలో 10 వేల రూపాయల చొప్పున మొత్తం కోటీ 70 లక్షల రూపాయలు డిపాజిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఎన్నికల అధికారులు నిఘా పెట్టారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ప్రలోభాలకు గురుచేయడానికి రాజకీయ నాయకులు ఎవరైనా జన్ధన్ ఖతాల్లో డబ్బు జమ చేశారా? లేదంటే ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందిన వారికి బ్యాంకు ఖాతాల్లో ఇప్పుడు నగదు జమైందా అనే అంశాలను ఈసీ పరిశీలిస్తోంది. అనుమానాస్పద డిపాజిట్లపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.