నిజామాబాద్‌లో ఈవీఎంలతోనే పోలింగ్… తేల్చిన ఈసీ

0
45

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో తెరాస సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత కూడా ఉన్నారు. దీంతో ఇక్కడ బ్యాలెట్ విధానంతో ఎన్నికలు నిర్వహిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఈవీఎంలతోనే ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం తేల్చేసింది.

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 11న ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర ఇన్‌చార్జి ఉమేశ్‌ సిన్హా స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో 185 మంది అభ్య ర్థులు పోటీ చేస్తుండటంతో అక్కడ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న అనుమానాలకు ఆయన తెరదించారు.

నిజామాబాద్‌ ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందంతో కలసి ఉమేశ్‌ సిన్హా సమీక్షించారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడిన సందర్భంలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో ఎన్నికలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారన్నారు. రాష్ట్రానికి ఇది మరో మైలురాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక కంట్రోల్‌ యూనిట్, 12 బ్యాలెట్‌ యూనిట్లు, ఒక వీవీప్యాట్‌యూనిట్‌ను వాడబోతున్నట్టు ఆయన చెప్పారు.