తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 11వ తేదీన పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత త్వరలోనే పోలింగ్ సర్వే ఫలితాలను వెల్లడిస్తానని విజయవాడ మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందో త్వరలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఇప్పటికే మీ సర్వే పేరుతో జగన్దే పైచేయి అని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోందన్న విలేకరుల ప్రశ్నకు.. కొండపై రాజకీయాలు మాట్లాడటం భావ్యం కాదన్నారు. తన సర్వే వివరాలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.
కాగా, గత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధిస్తుందని లగడపాటి ఎన్నికలకు ముందుగా ప్రకటించారు. కానీ, ఆయన సర్వే తారుమారైంది. అధికార తెరాస ఘన విజయం సాధించి విజయభేరీ మోగించింది. దీంతో ప్రీపోల్ సర్వేలను ఇకపై వెల్లడించనని ఆయన ఆ సమయంలో ప్రకటించారు.