తెలుగు రాష్ట్రాల్లో మహాయుద్ధంలా సాగిన ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్ 126 ప్రకారం పోలింగ్కి 48 గంటల ముందు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలు ముగించాల్సి ఉంటుంది. దీంతో మంగళవారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం బంద్ కానుంది.
రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, తెలంగాణాలోని 17 లోక్సభ సీట్లకు కూడా ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడతలో జరుగుతున్న పోలింగ్ ఫలితాలు మే 23వ తేదీ వెలువడనున్నాయి. ఈసారి ప్రచారంలో సోషల్ మీడియా ప్రభావం ప్రస్ఫుటంగా కనిపించింది.
అయితే, 10, 11 తేదీల్లో ప్రకటనలు జారీ చేయాలనుకునే పార్టీలు, అభ్యర్థులు తాజాగా ఎంసీఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో ఎంసీఎంసీ కమిటీ ఇచ్చిన అనుమతి మంగళవారం సాయంత్రం 6 గంటలతోనే ముగిసిపోతుందన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు తమ పేరు, పార్టీ గుర్తు, ఈవీఎంలో పేరు, పార్టీ గుర్తు, స్వతంత్రులు, గుర్తింపు పొందని రాజకీయ పార్టీల అభ్యర్థులైతే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు, ఈవీఎంలో క్రమ సంఖ్య ఉండే వివరాలతో మాత్రమే ప్రకటనలు జారీ చేయాలన్నారు.
వీటికి కూడా ఎంసీఎంసీ కమిటీ అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు పార్టీలు మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న ప్రకటనలు, డిజిటల్ రూపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ మంగళవారం సాయంత్రం 6 గంటల తర్వాత తొలగించాలన్నారు. మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పార్టీలు, అభ్యర్థులు ఎటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అలా చేస్తే కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు