ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : మహిళా ఓటర్ల చేతిలో గెలుపోటములు

0
37

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం జరుగనుంది. ఈ ఎన్నికల్లో 3.93 కోట్ల మంది వరకు ఓటర్లు ఉన్నారు. 2014తో పోలిస్తే 22లక్షల ఓటర్లు పెరిగారు. ఇక పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. శ్రీకాకుళం, అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉండగా, చివరి స్థానంలో విజయనగరం జిల్లా నిలిచింది. ప్రతి జిల్లాలోనూ ఓటర్ల సంఖ్య 20 లక్షలకు పైగా ఉండగా, ఒక్క విజయనగరంలో మాత్రమే 18 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓటర్లున్న జిల్లాల్లో తూర్పుగోదావరి తర్వాత గుంటూరు, విశాఖ ఉన్నాయి.

ఇక అత్యల్ప ఓటర్లున్న జిల్లాల్లో విజయనగరం తర్వాత శ్రీకాకుళం, కడప నిలిచాయి. ఇక ఏపీ మొత్తం ఓటర్లలో 30శాతం తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖ జిల్లాల్లోనే ఉండటం విశేషం.

మరోవైపు, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 91 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కూడా ఓటింగ్ జరుగనుంది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిన్నింటికీ కలిపి ఒకేసారి పోలింగ్ జరుపనున్నారు.

దేశంలో జరిగే తొలిదశలో 91 స్థానాలకు జరిగే ఎన్నికల పోలింగ్‌లో 1,280 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ సీట్లకు 319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే, 175 అసెంబ్లీ సీట్లకు 2,118 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఏపీలో మొత్తం 3,92,45,717 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో 9 వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.

అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 లోక్‌సభ సీట్లకు 445 మంది పోటీ పడుతుండగా, అత్యధికంగా నిజామాబాద్ స్థానానికి ఏకంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 2,96,97,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 34,094 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, 17 లోక్‌సభ సీట్లలో 13 సెగ్మెంట్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. నిజామాబాద్ స్థానంలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, మిగిలిన 7 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.