ఎన్నికల నిర్వహణపై చంద్రబాబు అసంతృప్తి… ఓటమి భయమే కారణమా?

0
53
chandrdababu naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఎన్నికల సంఘంపై గుర్రుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ఈసీపై వరుసగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా దాడిని కొనసాగిస్తున్నారు.

వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. శుక్రవారం అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. రివ్యూ పిటిషన్ వేసేందుకుగాను శనివారం ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిపారు.

వీవీ ప్యాట్‌ల మొత్తం లెక్కింపునకు ఆరు రోజుల సమయం పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొనడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీవీ ప్యాట్‌ల మొత్తం లెక్కింపునకు ఆరు రోజులు పట్టడమేంటని ప్రశ్నించారు. మొత్తం స్లిప్‌లు లెక్కించేందుకు ఆరు గంటలు మించదన్నారు.

గతంలో బ్యాలెట్ పత్రాలు లెక్కించే పద్ధలో ఎంత సమయం పట్టిందో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. దీనిపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమని చెప్పారు.