సాహో నుంచి అదిరిపోయే లుక్…

0
43

టాలీవుడ్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “సాహో”. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్. సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం భారత సినీ అభిమానులు కళ్లకు కాయలయ్యేలా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి.

శ్రద్ధా కపూర్ మొదటిసారిగా తెలుగులో నటిస్తుండటం, అది కూడా ఆరడుగుల ఆజానుబాహుడు ప్రభాస్‌తో కలిసి నటిస్తుండటం.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో వస్తుండటం.. ఇవన్నీ ఆసక్తిని పెంచాయి. అందుకే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు.

గత రెండేళ్లుగా ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. సాహో సెట్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు అప్పుడప్పుడు లీక్ అవుతున్నా.. అవి అంతగా మెప్పించలేదు. ఇటీవలే శ్రద్ధా కపూర్ బర్త్‌డే సందర్భంగా సాహో మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. మేకింగ్ వీడియో చూశాక.. సినిమా హాలీవుడ్ రేంజ్‌ను దాటిపోతుందని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

తాజాగా సినీ అభిమానుల కోసం సాహో సెట్‌లో ప్రభాస్, శ్రద్ధ రొమాంటిక్‌గా ఒకరిని మరొకరు చూస్తూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. ఆ ఫోటోను శ్రద్ధా కపూర్ ఫ్యాన్స్ పేజీలో పోస్ట్ చేశారు. అంతే ఇక నెటిజన్లు ఊరుకుంటారా? దొరక్క దొరక్క వాళ్లకు ఓ ఫోటో దొరికింది. అంతే.. దాన్ని వైరల్ చేసేస్తూ దానిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా, ఈ చిత్రం తెలుగుతో పాటు.. తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపుదిద్దుకుంటోంది. 2020 ఆగస్టు నెల 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.