జంపింగ్ జిలానీలతో చంద్రబాబు గుబులు : 22న ఎమ్మెల్యే – ఎంపీ అభ్యర్థులతో భేటీ

0
55

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఈనెల 11వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన వెలువడనున్నాయి. కానీ, అధికార టీడీపీ, విపక్ష వైకాపాలకు మాత్రం అపుడు జంపింగ్ జిలానీల గుబులు పుట్టుకుంది. ఫలితంగా ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంశాన్ని మాత్రం ఏ ఒక్కరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ దఫా ముక్కోణపు పోటీ నెలకొనగా, పోటీ మాత్రం చాలా కఠినంగా ఉంది. అదేసమయంలో వైకాపా మాత్రం అపుడే మైండ్‌ గైమ్ ఆరంభించింది. ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బల్లగుద్ది చెబుతోంది.

దీంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. తాము అధికారాన్ని కోల్పోతామన్న ఆందోళన చెందుతున్నారు. అదేసమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మేల్కొన్నారు. ఈనెల 22న రాష్ట్ర రాజధాని అమరావతిలో తమ పార్టీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా, టీడీపీ అభ్యర్థులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు చంద్రబాబుకు ఎన్నికల సంఘంపై ఫిర్యాదులు చేశారు. దీనిపై టీడీపీ అధినేత స్పందిస్తూ, ఈసీపై తమ పోరాటం ఆ అవకతవకలపైనే అని స్పష్టం చేశారు. అనంతరం, అమరావతిలో జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలంటూ ప్రత్యేకంగా కోరారు.

అంతకుముందు అభ్యర్థులతో మాట్లాడుతూ వాళ్లకు ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు. తాను అన్ని రకాల సర్వేలు, క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుని భేరీజు వేసుకున్న తర్వాత టీడీపీకి 120కి పైన సీట్లు రావడం ఖాయమని తెలుస్తోందన్నారు. పక్కా సమాచారంతోనే ఈ మాట చెబుతున్నానని చంద్రబాబు అనడంతో టీడీపీ అభ్యర్థుల్లో ఒక్కసారిగా ఆనందం పెల్లుబికినట్టు సమాచారం. ఏది ఏమైనా ఈనెల 22న రాజధానిలో జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందేనని ఆయన ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు.