మనోహర్ పారీకర్‌ కుమారుడుకి షాకిచ్చిన బీజేపీ

0
45

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్‌ కుమారుడుకి భారతీయ జనతా పార్టీ తేరుకోలేని షాకిచ్చింది. మనోహర్ పారీకర్ మృతితో గోవాలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటు కర్ణాటకలోని 2 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

కర్ణాటకలోని చించోలి స్థానానికి అవినాష్ జాదవ్, కుండ్గోల్ స్థానానికి చిక్కన గౌడర్ పేరుని ప్రకటించింది. అలాగే, గోవాలోని పనాజీ అసెంబ్లీ స్థానానికి సిద్ధార్ద్ శ్రీపాద్ కుంకలియేంకర్ పేరుని బీజేపీ ప్రకటించింది. మనోహర్ పారికర్ మరణంతో పనాజీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే.

పనాజీ స్థానానికి అభ్యర్థిగా పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పేరుని బీజేపీ ప్రకటిస్తుందని అందరూ భావించారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా ఇటీవల ఉత్పల్ ప్రకటించారు. అయితే అన్ని విధాల ఆలోచించిన తర్వాత పారికర్ అనుచరుడైన సిద్ధార్ద్ శ్రీపాద్ పేరుని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది.

కాగా, 2015లో పనాజీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా సిద్ధార్ద్ శ్రీపాద్ విజయం సాధించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే మనోహర్ పారికర్ కోసం సిద్ధార్ద్ తన సీటు వదులుకున్నారు. మే నెల 19వ తేదీన ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి అటనాసియో మోన్సీరట్టీ పోటీ చేస్తున్నారు.