టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ల మధ్య విభేదాలు పొడచూపినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపైనే ఇపుడు ఫిల్మ్ నగర్లో చర్చ సాగుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది.
మహేశ్ నటించిన ‘పోకిరి’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన పూరీ, ఆపై ‘బిజినెస్మేన్’ పేరిట మరో హిట్నూ మహేశ్కు అందించాడు. ఇక తాజాగా మహేశ్ 25వ చిత్రం ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుక, హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వేడుకలో మాట్లాడిన మహేశ్, తనకు సక్సెస్ ఇచ్చిన ఒక్కో దర్శకుడి పేరును చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ దర్శకుడు కె.రాఘవేంద్రరావు నుంచి తాజా చిత్రం దర్శకుడు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ చెప్పిన ఆయన, మధ్యలో పూరీ జగన్నాథ్ పేరును మాత్రం చెప్పలేదు.
‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన దర్శకుడి పేరు నిజంగానే మహేశ్కు గుర్తులేదా? అన్న అనుమానాలు ఇప్పుడు సినీ అభిమానుల్లో మొదలయ్యాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో ‘జనగణమన’ అనే సినిమా చాలా నెలల క్రితమే అనౌన్స్ అయినప్పటికీ, ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.
ఈ సినిమా విషయంలోనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలూ వచ్చాయి. ఇక ఈ విభేదాల చర్చకు చెక్ చెప్పాలని భావించిన మహేశ్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా పూరికి థ్యాంక్స్ చెప్పాడు. మహర్షి ఫంక్షన్ పూర్తయి ఇంటికెళ్లిన తర్వాత తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.