ప్రతి రక్తపుబొట్టుకూ ప్రతీకారం తప్పదు : నరేంద్ర మోడీ

0
45

దేశం నుంచి తీవ్రవాదాన్ని, నక్సలిజాన్ని ఏరిపారేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రతి నెత్తుటి బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఉగ్రవాదం అణిచివేతకు ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. తీవ్రవాదం, నక్సలిజం, మధ్యవర్తులు, పేదరికం లేని భారత్‌ను రూపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌పై విరుచుకుపడ్డారు.

నింగి, నేల, నీరు అన్నింటిలోనూ వాళ్లు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో మోడీ మాట్లాడుతూ.. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకే మహాకూటమి పార్టీలు అధికారాన్ని ఉపయోగించుకుంటాయని ఆరోపించారు. భారత్‌ సాధించిన విషయాలను వారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.