ఫ్రిజ్లో నిల్వ ఉంచిన బిర్యానీ తిని ఏడు నెలల గర్భిణి కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా వందవాసి మేల్పాదిరి గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వందవాసి మేల్పాదిరికి చెందిన రైతు వినాయకమూర్తి, ఉమ(30) దంపతులు. వీరికి రెండేళ్ల వయస్సు గల కుమారుడున్నాడు. ప్రస్తుతం ఉమ ఏడు నెలల గర్భవతి.
ఆమె శుక్రవారం రాత్రి మటన్ బిర్యానీ తినాలని ఉందని భర్తకు చెప్పింది. దీంతో భర్త మటన్ బిర్యానీ తెచ్చిచ్చాడు. ఈనెల 8వ తేదీ రాత్రి కొంత బిర్యానీ ఆరగించింది. మిగిలిన బిర్యానీని ఫ్రిజ్లో నిల్వవుంచుకుని ఆరగించింది.
ఆ బిర్యానీ తిన్న కాసేపటికి స్పృహ కోల్పోయింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన బంధువులు చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతిచెందింది. దీనిపై వందవాసి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.