ఇక సర్వేలు చేయనంటే చేయను.. నొప్పించివుంటే సారీ : లగడపాటి

0
46

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్‌లో సర్వేలు చేయబోనని తేల్చి చెప్పారు. తాను వెల్లడించిన గత రెండు సర్వేలు తప్పు అని తేలడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో ప్రజల నాడిని తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాను. ఈ ఎన్నికలపై తాను జరిపిన లెక్కలు తప్పాయన్నారు. ప్రజలు నాడి తెలుసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని, ఈ విషయంపై చింతిస్తున్నట్టు తెలిపారు.

అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి సర్వేలు చేయబోనని చెప్పారు. పైగా, తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగివుంటే మన్నించాలని కోరారు. గత 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానని, సర్వేలు చేయడం తనకు ఓ వ్యాపకం అని చెప్పారు.

ఈ సర్వేలు ఏ ఒక్క పార్టీకి అనుకూలంగానో, వ్యతిరేకంగా చేయలేదన్నారు. అదేసమయంలో నవ్యాంధ్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న వైఎస్. జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూనే, ప్రతిపక్ష నేతలగా చంద్రబాబు నిర్మాణాత్మక పాత్రను పోషించాలని కోరారు.