ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా? లేదా?

0
40
YS Jaganmohan Reddy
YS Jaganmohan Reddy

“ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా? లేదా?” ఇది పోకిరి చిత్రంలో డైలాగ్. వైకాపా నేతలు ఇపుడు సరిగ్గా ఇదే డైలాగ్‌ను రిపీట్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి రాజకీయాల్లో పండిపోయి… వయసుడిగిపోయాకే ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలకు కాలం చెల్లింది. రాజకీయాల్లో డివడిగా పరుగులు పెట్టే సత్తా ఉన్న నేతలకు… పిన్న వయసులోనే సీఎం పదవి దక్కుతోంది. ఈ జాబితాలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చేరిపోయారు. ఈయన కేవలం 46 యేళ్లకే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోనున్నారు.

పైగా, తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పిన్న వయసులోనే సీఎం అవుతున్న నాలుగో వ్యక్తిగా… వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 46 ఏళ్లు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్ళలో జగన్‌ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న టీడీపీ అధినేత చంద్రబాబును చిత్తుగా ఓడించి తక్కువ వయసులో నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ఈనెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఇక ఉమ్మడి ఏపీలో చిన్నవయసులో సీఎం అయిన మూడో వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్లకే ఆయన 1995లో సీఎం అయ్యారు. జగన్‌, చంద్రబాబు కంటే ముందు.. మరికొందరు తెలుగు నేతలు కూడా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి గద్దెను అధిరోహించారు. 1962లో దామోదరం సంజీవయ్య కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో నీలం సంజీవరెడ్డి 43 ఏళ్లకే ఏపీ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.