సాహో చిత్రం నుంచి తప్పుకున్న సంగీత త్రయం..

0
54

ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రూ.250 కోట్ల వ్యయంతో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి తేరుకోలేని షాక్ ఒకటి తగిలింది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతూ వచ్చిన సంగీత త్రయం శంకర్, ఎహసాన్, లాయ్‌లు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. హీరో ప్రభాస్‌, దర్శకుడు సుజీత్‌, నిర్మాతలు వంశీ, ప్రమోద్‌కి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్టు ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు.

అయితే, చిత్ర యూనిట్ మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. శంకర్‌ – ఎహసాన్‌ – లాయ్‌ ప్రకటన రావడానికి కొన్ని గంటల ముందు ‘సాహో’ చిత్రబృందం రెండో పోస్టర్‌ విడుదల చేసింది. ఆగస్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ మాట్లాడుతూ ‘హైటెక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నాం. ఇందులో ప్రభాస్‌ స్టైలిష్‌గా, కొత్త ఎనర్జీతో కనిపిస్తారు’ అని చెప్పుకొచ్చారు.

మరోవైపు, ఈ చిత్రానికి ‘షేడ్స్‌ ఆఫ్‌ సాహో: ఛాప్టర్‌ 1’కు తమన్‌, రెండో వీడియోకి జిబ్రాన్‌ నేపథ్య సంగీతం అందించారు. శంకర్‌ -ఎహసాన్‌ – లాయ్‌ తప్పుకోవడంతో తమన్‌ – జిబ్రాన్‌లో ఎవరో ఒకరు ‘సాహో’కి సంగీతం అందించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.