ప్రపంచ కప్ : తొలి మ్యాచ్‌లో సఫారీలు చిత్తు

0
36

ఐసీసీ వరల్డ్ కప్ పోటీల్లోభాగంగా, గురువారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా జట్టు చిత్తుగా ఓడిపోయింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు 104 పరుగులు భారీ ఆధిక్యంతో సఫారీలను చిత్తుచేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లు పేలవమైన బౌలింగ్‌ కారణంగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ పరుగుల వరద పారించారు.

ఆ జట్టు ఆటగాళ్లలో నలుగురు అర్థ సెంచరీలు బాదారు. జాసన్ రూట్ 54, జో రూట్ 51, ఇయాన్ మోర్గాన్ 57, బెన్ స్టోక్స్ 89 చొప్పున పరుగులు రాబట్టడంతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా, తాహిర్, కిసో రబడలు తలా రెండేసి వికెట్లు తీశారు.

ఆ తర్వాత 312 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టులో క్వింటన్ డికాక్ 68, డుసెన్ 50 చొప్పున పరుగులు చేయగా, మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఫలితంగా 104 పరుగుల తేడాతో ఓడిపోయింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రాణించిన బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.