ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కేబినెట్లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ ఈ మంత్రివర్గాన్ని ఖరారు చేశారు. వీరితో గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం 11.49 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకేసారి 25 మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించే అవకాశం ఉంది.
కాగా, జగన్ జట్టులో చోటు దక్కిన మంత్రుల వివరాలను పరిశీలిస్తే,
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్, తూర్పు గోదావరి జిల్లా నుంచి కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, పిల్లి సుభాష్ చంద్రబోస్, కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని (కృష్ణా జిల్లా), ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాస్రెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్, చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం, కడప నుంచి అంజాద్ బాషా, అనంతపురం నుంచి శంకర్ నారాయణలు ఉన్నారు. అలాగే, శాసనసభ స్పీకర్గా తమ్మినేని సీతారాం, ఉప సభాపతిగా కోన రఘుపతిలు ఉంటారు.