నా అభిమాన హీరోను నేరుగా చూడలేకపోయా : చిరంజీవి

0
191

తెలుగువాళ్లు గర్వించదగ్గ మహానటుల్లో ఎస్వీ రంగారావు ఒకరు. ఆయనపై సంజయ్ కిషోర్ రాసిన ‘మహానటుడు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్రహీరో చిరంజీవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భావోద్వేగాలకు లోనయ్యారు. తనకు నటుడు అవ్వాలన్న కోరిక కలిగింది ఎస్వీ రంగారావే కారణమన్నారు.ఎస్వీఆర్ నటించిన ‘జగత్ కిలాడీలు’, ‘జగజ్జంత్రీలు’ చిత్రాల్లో తన తండ్రి చిన్న పాత్రలు పోషించారని, ఆ సమయంలో ఎస్వీఆర్ గురించి ఇంటి వద్ద తన తండ్రి చెబుతుంటే ఆసక్తిగా వినేవాడ్నని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

నటుడిగా పేరు తెచ్చుకోవాలన్న కోరిక బలపడింది అప్పుడేనని తెలిపారు. అయితే, తన ఆరాధ్యనటుడైన ఎస్వీ రంగారావు గారిని తన జీవితంలో ఎన్నడూ కలవలేకపోవడం తీరనిలోటుగా మిగిలిపోయిందని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

కనీసం ఆయన్ని ప్రత్యక్షంగా కూడా చూడలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో తాను కోల్పోయింది, లోటుగా భావించేది ఏదైనా ఉందంటే అది ఎస్వీఆర్‌ను కలవలేకపోవడమేనని తెలిపారు.