దేశంలోనే ఎక్కువమంది దంపతులున్నది ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో

0
64

దేశంలో అత్యధిక సంఖ్యలో దంపతులున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ముందు వరసలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన మగవారిలో 48.1% ఆడవారిలో 52.1% మంది వివాహాలు చేసుకున్నవారు ఉన్నారు. అత్యధిక మంది వివాహితులున్న ఆంధ్రాలో… జీవిత భాగస్వామిని కోల్పోయినవారు, లేక వారి నుంచి ఎడబాటుకు గురైనవారు (డబ్ల్యూడీఎస్‌) కూడా ఎక్కువే. దేశ జనాభాలో ఇలాంటివారు 3.7% కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 5.1%, తెలంగాణలో 4.7% మంది ఉన్నారు. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌)-2017 గణాంకాల విశ్లేషణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
‘‘పెళ్లి చేసుకుని.. ఇల్లు చూసుకుని..
చల్లగ కాపురముండాలోయ్‌
ఎల్లరి సుఖమూ చూడాలోయ్‌
మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్‌’’ అని ముందుకు సాగిపోతున్నారట… ఆంధ్రా ప్రజలు! ఎందుకంటే దేశంలోనే అత్యధిక సంఖ్యలో దంపతులున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది మరి. తెలంగాణ కూడా ఈ విషయంలో ఐదో స్థానంలో ఉండటం విశేషం. శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే (ఎస్‌ఆర్‌ఎస్‌)-2017 గణాంకాల విశ్లేషణలో ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. 2021 జనాభా లెక్కలకు ముందస్తుగా చేపట్టిన ఈ సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలుశాఖ ఇటీవల విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం…
దేశ జనాభాలో 46.8% మంది వివాహితులు ఉండగా… అన్ని రాష్ట్రాల కంటే అధికంగా 54% మంది వివాహితులతో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా కేరళ (51.5%), తమిళనాడు (51.2%), పశ్చిమ బెంగాల్‌ (51.1%) ఆక్రమించాయి. తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.

 

తెలుగు రాష్ట్రాల్లో ఇలా…
ఎస్‌ఆర్‌ఎస్‌ 2017 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషుల్లో 52.5% మంది, మహిళల్లో 55.6% మంది వివాహితులు కాగా… తెలంగాణకు చెందిన మగవారిలో 48.1%, ఆడవారిలో 52.1% మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. దేశంలోనే అత్యంత తక్కువగా బిహార్‌ జనాభాలో 41.2% మంది మాత్రమే వివాహితులుండటం గమనార్హం.
ఇదో చేదు నిజం!
అత్యధిక మంది వివాహితులున్న ఆంధ్రాలో… జీవిత భాగస్వామిని కోల్పోయినవారు, లేదంటే వారి నుంచి ఎడబాటుకు గురైనవారు (డబ్ల్యూడీఎస్‌) కూడా ఎక్కువే! దేశ జనాభాలో ఇలాంటివారు 3.7% కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 5.1% (పురుషుల్లో 2.4%; మహిళల్లో 7.9%) మంది ఉన్నారు.
తెలంగాణ జనాభాలో ఇలాంటి వారు 4.7% (పురుషుల్లో 2%; మహిళల్లో 7.6%) మంది ఉన్నారు.
దేశవ్యాప్తంగా చూస్తే డబ్ల్యూడీఎస్‌ బాధితుల్లో ఎక్కువమంది తమిళనాడు (5.7%), కేరళ (5.6%)కు చెందినవారే!
జాతీయ స్థాయిలో చూసినా… భాగస్వామిని కోల్పోయి లేదా ఎడబాటుకు గురైనవారిలో మహిళలే ఎక్కువ. ఇలాంటి బాధితులు మగవారిలో సగటున 1.7% మంది ఉంటే, ఆడవారిలో 5.9% మంది ఉన్నట్టు ఎస్‌ఆర్‌ఎస్‌ విశ్లేషించింది.