అతడి బ్యాటింగ్‌ ఒకప్పటి స్థాయిలో లేదు

0
52

హేంద్రసింగ్‌ ధోనీకి ఇటీవలే 38 ఏళ్లు పూర్తయ్యాయి. అతడి బ్యాటింగ్‌ ఒకప్పటి స్థాయిలో లేదు. ధోని అనుభవం జట్టుకు చాలా అవసరం పడే టోర్నీగా భావించిన ప్రపంచకప్‌ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మహి నిష్క్రమణ లాంఛనమే అనుకుంటుండగా.. అతను ఇంకొంత కాలం టీమ్‌ఇండియాతో కొనసాగుతాడంటూ వార్తలు వస్తున్నాయి. అతను మ్యాచ్‌లు ఎక్కువగా ఆడకపోయినా.. జట్టుతో మాత్రం ఉంటాడంటున్నారు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా, వ్యూహకర్తగా టీమ్‌ఇండియాలో ధోని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదన్నది స్పష్టం! ధోని బ్యాటింగ్‌ జోరు తగ్గినా.. మిడిలార్డర్‌లో కీలక బ్యాట్స్‌మన్‌గా ఉంటూ వచ్చాడు. మహి లాంటి అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్‌ నిష్క్రమిస్తే.. ‘మిడిల్‌’ భారాన్ని మోసే బ్యాట్స్‌మన్‌ ఎవరన్న ఆందోళన ఉంది. ఇక కెప్టెన్సీ విడిచిపెట్టినా.. మైదానంలో అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో ధోని పాత్ర కీలకంగా ఉంటోంది. కోహ్లి ప్రతి మ్యాచ్‌లోనూ అతడి     సలహాలు, సూచనలు అందుకుంటున్నాడు.    ఇక వికెట్‌ కీపర్‌గానూ ధోని పోషించే పాత్ర ఎలాంటిదో తెలిసిందే. ధోని వారసుడువుతాడని భావిస్తున్న రిషబ్‌ పంత్‌ ఇంకా వన్డేల్లో కుదురుకోలేదు. ఈ నేపథ్యంలో ధోని ఇంకొంత కాలం జట్టుతో ఉండి.. తన నిష్క్రమణ తర్వాత జట్టు సమతూకం దెబ్బ తినకుండా, జట్టులో తాను లేని లోటు కనిపించనివ్వకుండా చేసి వెళ్తాడంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ధోని ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా ఆడబోయే తొలి సిరీస్‌కు దూరంగా ఉంటాడని సమాచారం. అతను ఆగస్టు 3న మొదలయ్యే వెస్టిండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండనని సెలక్టర్లకు ముందే చెప్పేసాడట. ఆ తర్వాతి వన్డే సిరీస్‌కు జట్టులోకి రావచ్చని.. కొంత కాలం జట్టుతో కొనసాగవచ్చని.. సెలక్టర్లు అతడిని తొలి ప్రాధామ్య వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేయరని.. తుది జట్టులో ఆడటం కూడా తక్కువగానే ఉంటుందని అంటున్నారు. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘పంత్‌యే ఇక తొలి ప్రాధామ్య వికెట్‌కీపర్‌గా ఉంటాడు. అతను కుదురుకునే వరకు ధోని జట్టులో ఉంటాడు. తన నిష్క్రమణ తర్వాత సంధి దశ సాఫీగా సాగేందుకే ధోని ఇలా చేయబోతున్నాడు. అతను 15 మంది సభ్యుల్లో ఒకడిగా ఉంటాడు. తుది 11లో ఉండకపోవచ్చు. వెస్టిండీస్‌ పర్యటనకు మాత్రం ధోని దూరంగా ఉంటున్నాడు’’ అని పేర్కొన్నట్లుగా ఓ పత్రికలో కథనం వచ్చింది. అయితే కుంబ్లే, గంగూలీ, ద్రవిడ్‌, లక్ష్మణ్‌, సచిన్‌ ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమించినపుడు కూడా బీసీసీఐ ఈ వైఖరిని అనుసరించలేదని.. ధోని విషయంలో మాత్రం ఇలా ఎందుకు చేస్తుందని.. ఇవన్నీ ఊహగానాలే అని కొట్టిపారేస్తున్న వాళ్లూ లేకపోలేదు. ధోని ఇంకొన్ని రోజుల్లోనే రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలే ఎక్కువ అని ఈ వర్గం అంటోంది.