‘సాహో’ను విడుదల వాయిదా చిత్ర బృందం

0
48

హైదరాబాద్‌: ‘బాహుబలి’ తర్వాత స్టార్‌ కథానాయకుడు ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే, ‘సాహో’ను ఆగస్టు 30న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. ఇందుకు కారణాన్ని ఇప్పుడు తెలియజేసింది.

సినిమాను అత్యంత నాణ్యతతో అభిమానులను అలరించేలా తీర్చిదిద్దడంలో ఆలస్యం అవుతుండటం వల్లే సినిమా విడుదల వాయిదా వేసినట్లు తెలిపింది. ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలకు అదనపు హంగులు జోడించడం వల్ల నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమైనట్లు పేర్కొంది. స్వాతంత్ర్యదినోత్సవం రోజు తీసుకురావాలని అనుకున్నా, కొన్ని కారణాల వల్ల అదే నెలలో తప్పకుండా విడుదల చేస్తామని స్పష్టం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, అరుణ్ విజయ్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తనిష్క్‌ బాగ్చ,  జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. యువీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీకృష్ణ, ప్రమోద్‌, భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.