బాలుడి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమైంది.

0
39

మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడి కిడ్నాప్‌ వ్యవహారం సుఖాంతమైంది. విజయలక్ష్మినగర్‌లో కిడ్నాపైన నాలుగేళ్ల జషిత్‌ను జిల్లా ఎస్పీ నయీం అస్మి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బాలుడిని ఆగంతుకులు    రాయవరం మండలం కుతుకులూరులో విడిచిపెట్టి వెళ్లినట్లు సమాచారం తెలియడంతో తమ సిబ్బంది అక్కడికి వెళ్లి బాలుడిని తీసుకొచ్చారని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు క్షేమంగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. బాలుడిని గుర్తించడంలో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. వ్యక్తిగత కారణాలే బాలుడి అపహరణకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

సోమవారం రాత్రి నాయనమ్మ పార్వతిపై దాడిచేసి దుండగులు బాలుడిని ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారాన్ని పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించి 17 బృందాలతో బాలుడి ఆచూకీ కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు జషిత్‌ దొరకడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కుమారుడు తిరిగి తమ చెంతకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు.