ఇందులో సన్నీ లియోనీ అతిథి పాత్రలో కనిపించారు.

0
44

ముంబయి: సినిమాలో సన్నివేశం కోసం చెప్పిన ఫోన్‌ నెంబర్‌.. నిజంగా బాలీవుడ్‌ తార సన్నీ లియోనీది అనుకుని కొందరు ఆ నెంబర్‌కు తెగ ఫోన్లు చేస్తున్నారు. బాలీవుడ్‌ నటులు దిల్జీత్‌ దొసాన్జ్‌, వరుణ్‌ శర్మ, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అర్జున్‌ పటియాలా’. ఇందులో సన్నీ లియోనీ అతిథి పాత్రలో కనిపించారు. ప్రత్యేక గీతంలోనూ మెరిశారు. ఈ నెల 26న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమాలోని ఓ సీన్‌లో సన్నీ తన ఫోన్‌ నెంబర్‌ను దిల్జీత్‌కు ఇస్తారు. ఈ మేరకు ఆమె చెప్పిన ఫోన్‌ నెంబరును దిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్‌ అగర్వాల్‌ ఉపయోగిస్తున్నారు. నిజంగానే అది సన్నీ నెంబర్‌ అని భావించిన జనాలు తెగ కాల్స్‌ చేస్తున్నారట. వీడియో కాల్‌ చేయాలంటూ, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పునీత్‌ మీడియాతో చెప్పారు. ‘అర్జున్‌ పటియాలా’ సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పారు. రోజుకు 150 ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

సాధారణంగా సినిమాలో చూపించే, చెప్పే ఫోన్‌ నెంబర్‌ వాడకంలో లేనిదో లేదా ప్రమోషన్‌ కోసమో ఉపయోగిస్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అది ఓ వ్యక్తి ఉపయోగిస్తున్నది కావడంతో  సమస్యలు ఎదురయ్యాయి. మరి ఈ విషయంపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.