సబ్కా మాలిక్ ఏక్ అన్న సందేశంతో యావత్ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా షిర్డిలో ఉంది. ఫకీర్ అవతారంలో అనేక మహిమలు ప్రదర్శించిన సాయినాథుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు షిర్డికి వస్తుంటారు.
శ్రద్ధ, సబూరి
శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, సబూరి అంటే ఓర్పు, సాధన సందేశాలతో మానవాళికి అమూల్యమైన శాంతి సందేశాన్ని ఇచ్చారు. సాయినాథుడు ఎక్కడ జన్మించారు అన్న అంశంపై వేర్వేరు వాదనలు ఉన్నాయి. అహ్మద్నగర్ జిల్లాలోనే 19 శతాబ్దంలో జన్మించినట్టు కొందరు పర్బానీ జిల్లాలో జన్మించినట్టు మరికొందరు పేర్కొంటారు. అయితే ఈ వాదనలను పక్కనబెడితే హిందూ, ముస్లింల మధ్య సఖ్యతకు కృషి చేసిన మహనీయుల్లో ఆయన అగ్రగణ్యుడు. షిర్డిలోని పాత మసీదు మందిరాన్నే తన నివాసంగా చేసుకొని మత సామరస్యత కోసం శ్రమించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని ద్వారకామాయిగా పిలుస్తున్నారు. సమాధి మందిరం పక్కన ఉన్న గురుస్థానంలో ఆయన కూర్చొని ఉండేవారు. తొలిసారిగా 1854లో బాలసాయిని వీక్షించిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండే సాయిని అనేక ప్రశ్నలు అడిగేవారు. అనంతరం ఆయన కొంతకాలం కనిపించలేదు.
ఆవో సాయి..
షిర్డి గ్రామంలోని ఖండోబా మందిరంలో మహాల్సాపతి పూజరిగా ఉండేవారు. ఒకసారి సాయి ఆ గ్రామంలోకి తిరిగి ప్రవేశించారు. ఆయనను చూసిన మహల్సాపతి ఆవో సాయి అని ఆహ్వానించారు. దీంతో ఆయన నామం సాయిగా స్థిరపడింది. భగవుంతునికి ఎలాంటి పేర్లు ఉండవు. భక్తులు ఏ పేరుతో పిలిస్తే పలుకుతారు అదే రీతిలో సాయిబాబాగా ప్రఖ్యాతిచెందారు. సాయి మహిమలను వీక్షించిన అనేక మంది ఆయన శిష్యులుగా మారారు. మహాల్సాపతి, శ్యామ, హరి సీతారాం, దామోదర్… తదితరులు ఆయన శిష్యగణంలో ఉండేవారు. స్వామివారి మహిమలు దేశమంతటా వ్యాపించడంతో అనేకమంది భక్తులు షిర్డికి రావడం ప్రారంభించారు. 1918లో ఆయన సమాధి చెందారు. అయితే సమాధి నుంచే భక్తులను అభయమిస్తుంటాను అన్న ఆయన దివ్య వ్యాఖ్యల ఫలితంగా షిర్డిక్షేత్రం భక్తజన క్షేత్రంగా మారిపోయింది.
సమాధిమందిర నిర్మాణం: బాబా భక్తులలో నాగ్పూర్కు చెందిన గోపాల్రావు బూటి ఒకరు. ఆయన కలలో స్వామి కనిపించి తనకు సమాధి మందిరాన్ని నిర్మించమని కోరారు. దీంతో బూటి ఆయనకు మందిరాన్ని నిర్మించారు. అదే మనం నేడు చూస్తున్న సమాధి మందిరం. షిర్డి ప్రవేశమే అన్ని పాపాలకు పరిహారం అన్న బాబా సూక్తికి అనుగుణంగా రోజు వేల మంది భక్తులు సాయి సన్నిధానానికి వస్తుంటారు. మందిర ప్రవేశంతోనే స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తూ దివ్యానుభూతి చెందుతారు. ద్వారకామాయితో పాటు చావడి, గురుస్థానం, నందదీప్, లెండి గార్డెన్స్… తదితర ప్రాంతాలను మనం చూడవచ్చు. ఈ ప్రదేశాల్లో సాయి నడియాడిన అంశం మనకు గుర్తుకు వస్తే మనస్సులో ఆధ్యాత్మిక భావన అలముకుంటుంది. సాయి సంస్థాన్ వారు బాబా వస్తువులతో ప్రత్యేకంగా ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. వీటిని కూడా వీక్షించవచ్చు.
ఎలా చేరుకోవచ్చు
* దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి షిర్డికి రైలు, బస్సు సౌకర్యముంది.
* హైదరాబాద్ నుంచి అజంతా ఎక్స్ప్రెస్, సాయినగర్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి.
* అజంతా ఎక్స్ప్రెస్లో వెళ్లేవారు నాగర్సోల్ స్టేషన్లో దిగాలి. అక్కడ నుంచి షిర్డికి అనేక వాహనాలు ఉంటాయి.
* సాయినగర్ ఎక్స్ప్రెస్లో వెళితే నేరుగా షిర్డి చేరుకోవచ్చు.
* షిర్డి సమీపంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇప్పటికే పలు విమాన కంపెనీలు సర్వీసులను అందిస్తున్నాయి.
* ఔరంగాబాద్ విమానాశ్రయంలో దిగి వాహనాల ద్వారా షిర్డి చేరుకోవచ్చు.