జమ్ము కశ్మీర్‌పై ఆర్టికల్‌ 370 రద్దు..

0
31

జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకొన్నాయి. ఆర్టికల్‌ 370ను రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలు ఏకకాలంలో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదే సమయంలో ఆర్టికల్‌370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి  స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్‌ 370(3)తో జమ్ముకశ్మీర్‌ లెజిస్లేటీవ్‌ అసెంబ్లీగా మారుతుంది. దీంతో జమ్ముకశ్మీర్‌  అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి అమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది.

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది.

జమ్ము కశ్మీర్‌ను తాము మిగిలిన దేశంతో అనుసంధానించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. భారత  రాజ్యాంగం మొత్తం జమ్ము కశ్మీర్‌లో అమలవుతుందన్నారు. మూడు కుటుంబాలు కలిసి జమ్ముకశ్మీర్‌ను దోచుకొన్నాయన్నారు. ‘‘గులాం నబీ ఆజాద్‌ చెప్పినట్లు 370 చారిత్రాత్మకం అంటున్నారు.. నేను ఆ విషయంలోకి వెళ్లడంలేదు. నేను చెప్పే అంశాలు చరిత్రాత్మకమైనవి. 370 కారణంగా కశ్మీర్‌కు చెందిన చాలా కుటుంబాలు అక్కడ దరిద్రంలో జీవిస్తున్నాయి. దీనిని అడ్డం పెట్టుకొని కొన్ని కుటుంబాలు అక్కడి ప్రజలను దోచుకొన్నాయి. మహారాజ హరిసింగ్‌ చేత భారత్‌లో కలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేశారు. అప్పట్లో ఆర్టికల్‌ 370 లేదు. ఆ తర్వాత వచ్చింది. ఆర్టికల్‌ 370 జమ్ము కశ్మీర్‌ను భారత్‌తో మమేకం కానివ్వలేదు. కశ్మీర్‌ను అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు ఓట్‌ బ్యాంక్‌ రాజకీయాలు చేశాయి. మోదీ ప్రభుత్వానికి ఆ అవసరం లేదు. సభ్యులు అందరూ చర్చించాలి.  ఆర్టికల్‌ 370 వచ్చాకే కశ్మీర్‌లో అరాచకాలు మొదలయ్యాయి. కశ్మీర్‌లో దళితులకు రిజర్వేషన్లు దక్కలేదనే విషయం దేశానికి తెలియాలి. కశ్మీర్‌లోకి వెళ్ళే అత్యధిక నిధులు ఎక్కడికి పోతున్నాయో చర్చించాలి. నేను ప్రతి  దానికి సమాధానం ఇస్తాను. ఆర్టికల్‌ 370 తొలగించడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు.’’ అని అమిత్‌ షా రాజ్యసభలో పేర్కొన్నారు.

‘‘కశ్మీర్‌ కోసం చాలా మంది రాజకీయ నాయకులు, సైనికులు, పలువురు సామాన్యులు ప్రాణాలను అర్పించారు. వీరంతా భారత్‌తో కలిసి ఉండేందుకే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశ చరిత్రలో ఓ చీకటి రోజు. కొందరి చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజ్యాంగాన్ని దెబ్బతీసే చర్యలను నేను ఖండిస్తున్నాను. నేడు భాజపా రాజ్యాంగాన్ని హత్య చేసింది.’’దీనిపై అమెరికా స్పందిస్తూ.. నియంత్రణ రేఖ వెంబడి భాగస్వామ్య పక్షాలన్నీ శాంతి, సుస్థిరతలకు కృషి చేయాలని అమెరికా సూచించింది. అలాగే ఐరాస అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. కశ్మీర్‌పై భారత్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం ఉందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంయమనం పాటించాలని సూచించారు. జమ్ముకశ్మీర్‌కి స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్ర ప్రభుత్వం సోమవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా విభజించారు. ఈ విషయాలన్నింటిని పీ5 దేశాలకు తెలియజేశారు.