ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాల నిర్వహణ

0
45

మద్యం వ్యాపారంలో ప్రైవేటు వ్యాపారుల దందాకు ఇక చరమ గీతం పాడనున్నారు. నిరుపేదలను నిలువునా మోసగించే చర్యలు ఇక సాగనివ్వరు. లూజు విక్రయాల పేరుతో దగా చేసే విధానానికి ఇక చెల్లు చెప్పనున్నారు. కల్తీ మద్యంతో అనారోగ్యం కొనితెచ్చుకోనక్కర లేదు. ప్రభుత్వమే ఇక మద్యం దుకాణాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి దశలవారీగా మద్యనిషేధం చేస్తామని ప్రకటించారు.  తొలుత బెల్టుషాపులు నిరోధించి…కొంతవరకు పల్లెల్లో ప్రశాంతవాతావరణం నెలకొల్పారు. ఇప్పుడు మద్యం దుకాణాలు పూర్తిగా ప్రభుత్వపరంగానే నిర్వహించడంతో లూజు విక్రయాలు… కల్తీ మద్యానికి చెల్లు చెప్పనున్నారు. ప్రస్తుతం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన 210 మద్యం దుకా ణాలు ప్రైవేటు వ్యాపారుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఇక విడి విక్రయాలకు ఆస్కారం ఉండదు. దీనివల్ల కల్తీ జరిగే అవకాశమే ఉండదని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. అలాగే మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అనధికార విక్రయాలకు ఆస్కారం ఉండదు. దీంతో మద్యం విక్రయాలు తగ్గే అవకాశం ఉండటం, దశలవారీ మద్య నిషేధానికి బాటలు పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సిబ్బందిని నియమించడంతో వారు నిర్ణీత వేళల్లోనే పని చేస్తారు కాబట్టి అనధికార విక్రయాలు జరపడానికి వీలుపడదు.