మేనల్లుడి ఫిర్యాదుపైనా దర్యాప్తు

0
32

కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్‌ పోలీసులు ముమ్మరం చేశారు. ఆయన ఆత్మహత్యకు కుటుంబ వివాదాలు ఏమైనా కారణమా? అనే కోణంలోనూ విషయ సేకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా కోడెల తనయుడు శివరామ్‌ను త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. కోడెల కొన్ని రోజుల కిందట కూడా తన స్వస్థలంలో ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు ఆ విషయం దాచి గుండెపోటుగా చిత్రీకరించడంపైన తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు, కుటుంబీకుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన మేనల్లుడు కంచేటి సాయిబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి డీఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల నుంచి తమకు అందిందని హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోడెల ఆత్మహత్య కేసుతో కలిపి దర్యాప్తు చేస్తామని ఆయన చెప్పారు.