ఏళ్లనాటి విద్యుత్ సమస్యలకు ఇప్పుడిప్పుడే మోక్షం లభిస్తోంది. ప్రత్యేక నిధుల్లేక ప్రస్తుతం ఉన్న పనులకే మరమ్మతులు చేస్తుండగా.. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యలకు చెక్ పడుతోంది. విద్యుత్ స్తంభాలు కావాలని, విద్యుత్ లైన్లు వేలాడుతున్నాయని, విద్యుత్ స్తంభాలు వంగాయని, లో ఓల్టేజీ వస్తోందని, మీటర్లు అమర్చాలని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని తరచూ అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ప్రజలకు ‘పవర్ వీక్’ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు సమస్యలపై నడుం బిగించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మూడు నెలల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశాలిచ్చారు. ఇదిలా కొనసాగుతుండగానే గ్రామాల్లో ఈ నెల 6 నుంచి చేపట్టన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యుత్ సమస్యలనూ అధికారులు గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారమే మార్గంగా ముందుకు సాగుతున్నారు. దీంతో గ్రామాల్లో కొంతమేర విద్యుత్ ప్రమాదాలకు చెక్ పడనుంది.