నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ పిడుగుపడి ఓ ఇల్లు ధ్వసమైంది. చాదర్ఘట్లోని ఓల్డ్ మలక్పేట్లో రేస్ కోర్టు సమీపంలో ఇంటిపై పిడుగు పడింది. భారీ శబ్దానికి ఇంటిలోని వారు పరుగులు తీశారు పిడుగు దాటికి ఇంటిపై కప్పు, గోడలు బీటలు పారాయి. గోడల నుంచి పెచ్చులు ఊడి పడ్డాయి. పెద్ద శబ్దం రావడంతో దిక్కుతోచక ఇంటలో నుంచి పరుగులు తీశామని ఇంటి యజమాని చెబుతున్నారు.
ఐదు రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. మంగళవారం సాయంత్రం క్యూములోనింబస్ మేఘాలతో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. గంట పాటు కురిసిన భారీవర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఫిలింనగర్, జూబ్లిహిల్స్, జంజారాహిల్స్, ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరద నీరు రహదారులను ముంచేసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.