‘అల… వైకుంఠపురములో’ మరో పాట ‘రాములో… రాములా’

0
50

అల… దీపావళికి మరో పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అల్లు అర్జున్‌ సిద్ధమయ్యారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల… వైకుంఠపురములో’. ఈ చిత్రంలో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా… ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకల్పనలో సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘సామజ వరగమన’ శ్రోతలను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌లో అత్యధిక లైక్స్‌ (7లక్షలు) పొందిన తొలి తెలుగు పాటగా అరుదైన రికార్డు సొంతం చేసుకుందని చిత్రబృందం తెలిపింది. ఇప్పటివరకూ ఈ పాటకు 40 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి. చిత్రంలోని రెండో పాట ‘రాములో… రాములా’ టీజర్‌ను సోమవారం విడుదల చేయనున్నట్టు అల్లు అర్జున్‌ తెలిపారు. దీపావళికి పూర్తి పాటను విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో రాజ్‌ పాత్రలో నటిస్తున్న హీరో సుశాంత్‌ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.