ప్రేమికులు ఇద్దరికీ ఒకే చితి పేర్చి.. దహనంచేసిన గ్రామస్తులు..

0
41

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీ రాజధాని లక్నో సమీపంలో ఉన్న మలిహాబాద్‌లో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు, 18 ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. అయితే, వారి పెళ్లి చేయడానికి రెండు కుటుంబాలు నిరాకరించాయి. ఈ క్రమంలో యువతికి మరో యువకుడితో పెళ్లి చేయడానికి ఆమె కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఆమెకు మరో యువకుడితో నిశ్చితార్థం కూడా చేశారు. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి ప్రేమికులు ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు.

ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వెంటనే వారిద్దరికీ అంత్యక్రియలు జరిపించేశారు. ప్రేమికులు ఇద్దరికీ ఒకే చితి పేర్చి.. వారిని దహనం చేశారు. ఈ విషయం గ్రామం దాటి బయటకు వెళ్లకుండా పెద్దలు ఆదేశాలు ఇచ్చారు. చివరకు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న విషయం పోలీసులకు కూడా తెలియలేదు. ఘటన మొత్తం జరిగిపోయిన తర్వాత ఎప్పుడో పోలీసులకు విషయం చేరింది. అయితే, ఈ విషయంలో తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెప్పడం గమనార్హం.