జగన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ.

0
54

ఏపీ సీఎం జగన్ ఇవాళ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆయన మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు బర్త్‌డే విషెస్ చేబుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆయనకు దీర్ఘ ఆయుష్సు, ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు జగన్ 47వ పుట్టిన రోజు వేడుకలకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిసారీ ప్రజల మధ్యే పుట్టిన రోజు జరుపుకున్న ఆయన… ఇవాళ కూడా అలాగే చేయాలనుకుంటున్నారు.

జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు ఇది కావడంతో… పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. హైవేలపై ఎక్కడ చూసినా వైసీపీ జెండాలే కనిపిస్తున్నాయి. మరోవైపు చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని కూడా జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. నేడు అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్… ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ధర్మవరంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభపైనే జగన్ 47వ జన్మదిన వేడుకలు కూడా జరపనున్నట్లు తెలిసింది.