ఏంచక్కా పెళ్లి చేసుకొని… అత్తగారింటికి వెళ్లి బిర్యాని తినాల్సిన అల్లుడు కాస్త… జైలుకు వెళ్లి చిప్ప కూడు తింటున్నాడు. దీనికి ఆయన దుర్బుధ్దే కారణం. పిల్లనిచ్చిన మామ ఇంటికే కన్నం వేశాడు. దీంతో కాబోయే అల్లుడే దొంగ అని తేలడంతో…అతడ్ని జైలుకు పంపించారు కాబోయే అత్తమామలు. హైదరాబాద్, పాతబస్తీలోని కాలాపత్తర్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. శాస్త్రిపురం కింగ్ కాలనీకి చెందిన సల్మాన్ఖాన్ (27) సేల్స్మన్. కాలాపత్తర్కు చెందిన యువతితో అతడికి వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లి కుమార్తె ద్వారా అత్తవారింట్లోని నగదు, నగలు విషయాన్ని తెలుసుకున్న సల్మాన్ఖాన్లో మనసులో దుర్బుద్ధి మొదలైంది. వాటిని ఎలాగైనా కాజేయాలని ప్లాన్ వేశాడు.
అయితే కాబోయే అత్తగారింటి వాళ్లంతా ప్రార్థనల కోసం దర్గాకు వెళ్లిన విషయం తెలుసుకున్న సల్మాన్ ఎవరికీ తెలియకుండా ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకుని కిటికీ తొలగించి లోపలికి దూరాడు. బీరువాలోని రూ.2.20 లక్షల నగదు, నగలు తీసుకుని పరారయ్యాడు. దర్గా నుంచి ఇంటికి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు నగలు, నగదు మాయం కావడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీకెమెరాల ఆధారంగా చోరీ చేసింది కాబోయే అల్లుడేనని తేల్చారు. అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.