థియేటర్ లో సడన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక.

0
35

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. శనివారం రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్సాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌ట్రా షోస్‌కు పర్మిషన్‌ ఇవ్వటంలో తెల్లవారుజామునుంచే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించింది. హైదరాబాద్‌లో ఉదయం 7 గంటల నుంచి షోస్‌ ప్రారంభమయ్యాయి. అయితే హీరోయిన్‌ రష్మిక గతంలో సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులతో కలిసి చూస్తానని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం శనివారం ఉదయం సిటీలోని మూసాపేట్‌ శ్రీరాములు థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చేసేందుకు వెళ్లింది. రష్మిక థియేటర్‌కు రావటం గమనించిన అభిమానులు పెద్ద ఎత్తున జై మహేష్ బాబు, జై రష్మిక అంటూ నినాదాలు చేశారు.

తొలి షోకు ఏకంగా హీరోయిన్‌ రావటంతో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే అభిమానులు రష్మికను చుట్టుముట్టటంతో అక్కడ కొద్ది సేపు గందరగోళ వాతావరణం కనిపించింది. ప్రేక్షకులు, అభిమానులు రష్మికతో సెల్ఫీల కోసం ఎగబడటంతో వారిని కంట్రోల్ చేయటం పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి ఇబ్బందికరంగా మారింది.

దిల్ రాజు సమర్పణలో అనిల్‌ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాతో దాదాపు 13 ఏళ్ల తరువాత సీనియర్‌ నటి విజయశాంతి సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రకాష్ రాజ్‌ విలన్‌గా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌, సంగీత, అజయ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు.