పాఠశాల ఆవరణలోకి దయ్యాలు. విద్యార్థుల భయాందోళన.

0
53

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు కృషి చేయాల్సిన ప్రధానోపాధ్యాయురాలే తన అజ్ఞాన చర్యలతో వార్తల్లో నిలిచింది. వైజ్ఞానిక పరిశోధనల దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే స్థానంలో ఉండి క్షుద్రపూజలంటూ పిల్లల్ని భయపెడుతోంది. తన చాదస్తాన్ని ఏకంగా ప్రభుత్వ పాఠశాలలోనే ప్రదర్శిస్తోంది. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.

పాఠశాల ఆవరణలోకి దయ్యాలు వస్తున్నాయని, దీంతో విద్యార్థులు స్కూ్ల్‌కు సరిగా రావట్లేదని, అలాగే తన ఆరోగ్యం బాగుండటం లేదనే మూఢనమ్మకాలతో ప్రధానోపాధ్యాయురాలు క్షుద్ర పూజలు చేయించింది. గత 4 రోజులుగా పాఠశాల విధులకు ప్రాధానోపాధ్యాయురాలు శుక్రవారం సాయంత్రం కారులో మంత్రగాడిని తీసుకొచ్చింది. శుక్రవారం గ్రహణం, పౌర్ణమి కావడంతో మంత్రగాడిని తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేయించింది. శనివారం ఉదయం ఇందుకు సంబంధించిన ఆనవళ్లు కనిపించడంతో విద్యార్థులు పరుగులు తీశారు.

ఏమైందో తెలుసుకునేందుకు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పాఠశాల ఆవరణలో పూజా సామాగ్రి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. దీన్ని చూసిన పాఠశాల ఉపాధ్యాయులు సైతం భయాందోళన వ్యక్తం చేశారు. హెచ్ఎం ఇంతకు ముందు కూడా చాలా సార్లు స్కూల్లో క్షుద్రపూజలు చేయించినట్లు చెబుతున్నారు. హెచ్ఎం ఎవరి కోసం ఇదంతా చేయిస్తున్నారో గానీ.. ఈ చర్యల వల్ల మాత్రం విద్యార్థులు పాఠశాలకు రావాలంటే భయపడుతున్నారని పేర్కొన్నారు. హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.