వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

0
65

వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు అని జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపడుచులపై పోలీసులు చేసిన పాశవిక దాడిని మర్చిపోనని పవన్‌ చెప్పారు. అమరావతిలో సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన వారిలో గాయపడ్డ మహిళలను మంగళవారం పవన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా పోలీసులు లాఠీచార్జ్‌ చేశారని, ఒళ్లంతా మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారని వ్యాఖ్యానించారు. రైతులు, మహిళలపై లాఠీఛార్జ్‌ కంటతడి పెట్టిస్తోందని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఆలోచనా విధానాన్నే పోలీసులు అవలంభిస్తున్నారని, వైసీపీ నేతలు వాడిన పదజాలం బాధాకరమని చెప్పారు. ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక సామాజికవర్గం అని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న నెపంతో.. ఇన్ని కులాలను, ఇంత మందిని క్షోభపెట్టారని పవన్‌ మండిపడ్డారు. వైసీపీ వినాశనం మొదలైందని, భవిష్యత్‌లో వైసీపీ ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. మూడు పంటలు పండే పొలాలను రాజధాని కోసం త్యాగం చేశారని, ఇక్కడి నుంచి అమరావతి కదలబోదని పవన్‌ చెప్పారు. శాశ్వత రాజధాని అమరావతిలోనే ఉండాలని, నమ్మి ఓట్లు వేస్తే వైసీపీ వంచన చేస్తోందని విమర్శించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌‌కు పాల్పడిన వారిపై కేసులు పెట్టాలిగాని, రాజధానిని తరలించడమేంటని పవన్‌ ప్రశ్నించారు.