నేడు గుంటూరులో బంద్… మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు.

0
33

అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపుతో బుధవారం గుంటూరు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బంద్ జరుగుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి జేఏసీ నేతలు, విద్యార్థి సంఘాలు, విపక్ష పార్టీలు ఆందోళనలకు దిగాయి. గంటూరు ఎన్టీఆర్ సర్కిల్‌ దగ్గర కాలేజీ, స్కూల్ బస్సుల్ని అడ్డుకున్నారు. టీడీపీ నేతలు గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేశారు.

బంద్‌తో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గుంటూరు టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పలువురు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు కృష్ణా జిల్లాలో కూడా బంద్ పాటిస్తున్నారు. విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అలాగే అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో కూడా బంద్ కొనసాగుతుంది. రైతుల ఆందోళనలు, దీక్షలు కూడా నడుస్తున్నాయి.

మరోవైపు బంద్‌కు అనుమతులు లేవని గుంటూరు, కృష్ణా జిల్లాల పోలీసులు చెబుతున్నారు. బంద్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారని.. ఆందోళనకారులు షాపులు, విద్యా సంస్థల్ని బలవంతంగా మూయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.