శాసన సభలో భారీ మెజారిటీ.. మండలిలో మాత్రం తక్కువ మెజారిటీ.. దీని ఫలితంగా సీఎం జగన్ పలు బిల్లులను ఆమోదించుకోలేకపోతున్నారు. మొన్నటికి మొన్న ఇంగ్లిష్ మీడియం బిల్లును తిప్పి పంపిన మండలి, నిన్న రెండు కీలక బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపింది. అక్కడ టీడీపీ బలంగా ఉండటమే దానికి ప్రధాన కారణం. అయితే, ఈ పరిస్థితి జగన్కే కాదు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు కూడా ఎదురైంది. అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉండేది. కానీ.. మండలికి వచ్చే సరికి మాత్రం కాంగ్రెస్దే హవా కొనసాగింది. టీడీపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు అడ్డు తగులుతూ వచ్చింది. దీని వల్ల ఎన్టీఆర్కు చిర్రెత్తుకొచ్చింది. ఎన్టీఆర్కు మండలిలో రోశయ్య ముప్పు తిప్పలు పెట్టారని అంటుంటారు. దీంతో.. 1985లో ఆయన మండలిని రద్దు చేశారు. అప్పటి నుండి మళ్లీ తిరిగి రాజశేఖర్ రెడ్డి 2004లో సీఎం అయ్యేంత వరకు మండలి ఏర్పాటు కాలేదు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి కొలువుదీరింది.
ఎన్టీఆర్కు వచ్చిన సమస్యే ఇప్పుడు జగన్కు ఎదురవుతోంది. అప్పుడు మామ(ఎన్టీఆర్)ను ఇబ్బంది పెట్టిన మండలి ఇప్పుడు అల్లుడికి(చంద్రబాబు) కలిసి రాగా, తండ్రి(వైఎస్ఆర్) తిరిగి తీసుకొచ్చిన అదే మండలి ఇప్పుడు కుమారుడి(జగన్)ని ఇబ్బంది పెడుతోంది.