ఆ సూత్రమే సీఎం జగన్‌కు ఇబ్బందిగా మారిందన్న నిపుణులు.

0
45

సీఎం జగన్ అధికారం చేపట్టిన వెంటనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లే బిల్లు సెలక్ట్ కమిటీకి పంపాల్సి వచ్చిందని, లేకపోయుంటే ఇప్పటికే బిల్లు మండలిలోనూ ఆమోదం పొంది ఉండేదని, మూడు రాజధానుల ప్రక్రియ మొదలై ఉండేదని అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఆ నిర్ణయం ఏంటంటే.. వేరే పార్టీ నుంచి వైసీపీలోకి రావాలనుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎవరైనా సరే ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి తమ పార్టీలోకి వచ్చి గెలవాలని స్పష్టం చేశారు. ఒక సూత్రంగా పెట్టుకొని దాన్నే ఫాలో అవుతున్నారాయన. ఆ సూత్రమే సీఎం జగన్‌కు ఇబ్బందిగా మారిందని అంటున్నారు నిపుణులు.

ఆ సూత్రాన్ని పక్కనబెడితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గంపగుత్తగా వచ్చి చేరేవారని, మండలిలోనూ పార్టీ ఆధిక్యం సాధించి బిల్లు ఆమోదం పొంది ఉండేదని తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మండలిలో వైసీపీకి బలం లేదు. ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉంది. ఆ బలంతోనే బిల్లును సెలక్ట్ కమిటీకి పంపేలా టీడీపీ పావులు కదిపిందని, పైగా.. మండలి ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ఎమ్మెల్సీయే ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.