తీహార్ జైలులో నిర్భయ దోషులకు కట్టుదిట్టమైన భద్రత.

0
38

దేశంలో సంచలనం రేపిన నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష పడబోతోంది. ఆ రోజు ఉదయం 6 గంటలకు తీహార్ జైలులోనే నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఐతే ఉరిశిక్షను ఆలస్యం చేసేందుకు దోషులు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. రివ్యూ పిటిషన్, క్యురేటివ్, మెర్సీ పిటిషన్లంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇక ఉరిశిక్షకు సరిగ్గా 6 రోజులే ఉండడంతో దేనికైనా తెగించే అవకాశముంది. ఈ క్రమంలో తీహార్ జైలులోని దోషులు ఉండే బ్యారక్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.

జైలు గదుల్లో ఎలాంటి వస్తువులు లేకపోవడంతో.. దోషులు తమను తాము గాయపరచుకోవడానికి తలను గోడకు బాదుకునే అవకాశం ఒక్కటే ఉంది. వారు అలా చేస్తే క్షణాల వ్యవధిలోనే వారి ప్రయత్నాలను నిలువరించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న రామ్‌సింగ్ మార్చి 11, 2013లో జైలు గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అలాంటి ఘటనలు ఎవైనా జరిగితే దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఏ చిన్నపొరపాటు జరిగినా ఉన్నతాధికారులకు ముప్పు వచ్చే అవకాశముంది. ఈ క్రమంలో దోషులున్న గదుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దోషులను వైద్యులు ప్రతిరోజూ పరీక్షించి నివేదికలను ఉన్నాతాధికారులకు పంపుతున్నారు. ఇక నలుగురు దోషుల్లో పవన్ తప్ప మిగిలిన ముగ్గురిలో ఎలాంటి ఆందోళన లేదు. పవన్ మాత్రం కొన్నిసార్లు ఆహారం తినడం లేదని అధికారులు తెలిపారు.

2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో గ్యాంగ్ రేప్ జరిగింది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో తీవ్రగాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఎలిజబెత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులంతా దోషులుగా తేలారు. దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. దోషిగా తేలిన మైనర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్‌లో తీర్పు వెలురించింది. 2014 మార్చిలో ఈ తీర్పును ధ్రువీకరించిన సుప్రీంకోర్టు.. దీన్ని సమర్థిస్తూ 2017 మేలో తీర్పు వెలువరించింది. నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది.