హైదరాబాద్ లో నలుగురు వ్యక్తుల్లో కరోనా వైరస్ లక్షణాలు.

0
61

హైదరాబాద్ లో కరోనా వైరస్ లక్షణాలతో నలుగురు వ్యక్తులు ఆసుపత్రుల్లో చేరారు. వీరిని మంగళవారం ఫీవర్, గాంధీ హాస్పిటల్స్‌లో చేర్పించారు. వీరి దగ్గర్నుంచి శాంపిళ్లను సేకరించిన అధికారులు పరీక్షలకు పంపారు. కరోనా లక్షణాలు ఉన్న నలుగురిలో ఇద్దర్ని గాంధీలో, మరో ఇద్దర్ని ఫీవర్ హాస్పిటల్‌లో చేర్పించామని కరోనా వైరస్ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాకర్ట్ జి.విజయ్ కుమార్ తెలిపారు. వీరందర్నీ ఐసోలేషన్ వార్డుల్లో అబ్జర్వేషన్లో ఉంచామన్నారు.

తెలంగాణ ప్రభుత్వం మంగళవారం హెల్త్ వార్డులను ఏర్పాటు చేసింది. థర్మల్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 3297 మంది ప్రయాణికులను స్క్రీనింగ్ చేశామని తెలిపింది. 21 మంది ప్రయాణికుల దగ్గర్నుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా.. రిపోర్టులో నెగటివ్ వచ్చిందని చెప్పింది. హాస్పిటల్స్‌లో, ఇళ్లలో అబ్జర్వేషన్లో ఉంచిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం సూచనలతో మరో 14 మంది ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న కారణంగా ప్రస్తుతం 25 మంది ప్రయాణికులను అబ్జర్వేషన్లో ఉంచామని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా చైనాలో దాదాపు 500 మంది మరణించగా.. కేరళలోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన కేరళ సర్కారు కరోనాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది.